కొత్త పార్లమెంట్ భవనం గుర్తుగా 75 రూపాయల నాణెం
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెంను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల రగడ రాజుకుంటుండగా, మరో వైపు ఈ భవనం గుర్తుగా కొత్తగా రూ. 75 కాయిన్ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం సింహ రాజధాని, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. 5 గ్రాముల బరువు గల నాణెం నాలుగు భాగాల మిశ్రమంతో తయారు చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 నాణెం తయారు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్, కుడి వైపున ఆంగ్లంలో భారత్ అనే పదం రాశారు.
నాణేనికి రూపాయి చిహ్నం, లయన్ క్యాపిటల్ కింద రాసిన అంతర్జాతీయ అంకెల్లో 75 డినామినేషన్ విలువ కూడా ఉంటుంది. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది. నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. ఈ నాణెంలో 50 శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ ఉన్నాయి.కొత్త పార్లమెంట్ భవనాన్ని స్వతంత్ర వీర సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.


