2, మార్చి 2023, గురువారం

మహిమాన్విత దివ్యక్షేత్రం కాణిపాకం

సజీవ దేవుడు కాణిపాకం వినాయకుడు  

రోజు రోజుకూ పెరుగుతున్న  స్వామి ఆకారం 

సత్య ప్రమాణాలకు నిలయం   


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే



         తెలుగు రాష్ట్రాలలోని మహిమాన్విత పుణ్యక్షేత్రాలలో కాణిపాకం ఒకటి. ఇక్కడి వినాయకుడు స్వయంభువు. ప్రాణం ఉన్న దేవుడు. ఇక్కడి స్వామి నిత్యం పెరుగుతున్నారు. స్వామికి గతంలో చేసిన కవచం ఇప్పుడు పట్టడం  లేదు. స్వామి ఇప్పుడు ఉదరం వరకు దర్శనం ఇస్తున్నారు. స్వామి పాదాలు కనపడితే కలియుగం అంతం అవుతుందని భక్తుల నమ్మకం. సత్యప్రమాణాలకు కాణిపాకం ప్రసిద్ధి. బ్రిటిష్ కాలంలో కూడా కోర్టులు ఇక్కడ ప్రమాణం చేస్తే, దానినే రుజువుగా గుర్తించేవారు. దొంగతనం చేయలేదనీ,  మాట తప్పలేదని కాణిపాకంలో ప్రమాణం చేయమని కోరుతారు. అలాగే రాజకీయనాయకులు కూడా సవాళ్లు, ప్రతి సవాళ్ళల్లో  కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అని ఛాలెంజ్ చేయడం తరచు వింటుంటాం. కాణిపాకంలో తప్పుడు ప్రమాణం చేస్తే 3 నెలల్లో స్వామి శిక్షిస్తారని భక్తుల నమ్మకం.  అలాగే రాజకీయ నాయకులు తప్పుడు ప్రమాణం చేస్తే, రాజకీయ భవిషత్తు ఉండదని భావన ఉంది. వీటి దృష్ట్యా కాణిపాకం ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి రోజూ భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులకు అవసరం అయిన వసతి, నిత్యాన్నదానం ఆలయ అధికారులు కల్పించారు. గణేష్ మాల ధరించి, కాలినడకన  భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం ఇటీవల బాగా పెరుతుంది.  భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయానికి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. 


కాణిపాకం (Kanipakam)  స్థల పురాణం
కాణిపాకం ఆలయానికి ఒక పురాణం కథ  ఉంది.  “కాణి” అంటే ఒకటిన్నర ఎకరం  భూమి.  “పారకం” అంటే  నీటిపారుదల.  కాణిపారకమే కాలక్రమంలో కాణిపాకం (Kanipakam)గా రూపాంతరం చెందింది. పురాణం కథ ప్రకారం విహారపురి అనే గ్రామంలో  మూగ, చెవిటి, అంధుడు  ముగ్గురు వికలాంగ సోదరులు  నివాసం  ఉన్నారు. 


ముగ్గురూ కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అలా ఉండగాఇద్దరు తమ  భూమికి కాలువ ద్వారా నీటిని ఏతం ద్వారా  ఎత్తిపోసే పనిలో  నిమగ్నమై ఉండగాకొంత సమయం తర్వాత బావిలో నీరు అయిపొయింది.  బావిని లోతు చేయడానికి ఒక రైతు బావిలోకి దిగి గడ్డపారతో తవ్వడం మొదలుపెట్టాడు. తవ్వుతూ ఉండగా గడ్డపారకు ఒక రాయి తగిలింది. ఆ  రాయి నుండి రక్తం రావడంతో ప్రారంభం అయ్యింది. దీంతో  నీరు మొత్తం  ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. దీంతో ఆశ్చర్యకరంగా ముగ్గురి వికలాంగులు సకలాంగులు అయ్యారు. మూగవానికి మాట వచ్చింది. చెవిటి వానికి వినిపించడం ప్రారంభం అయ్యింది. అంధునికి కంటి చూపు వచ్చింది.  ఆనందానికి అంతులేదు.  వారు పరుగెత్తి గ్రామంలోకి వెళ్లి ఈ విషయం చెప్పారు. గ్రామస్తులు వచ్చి భక్తి శ్రద్దలతో ఆ రాతికి పూజలు చేసారు.  


వారు బావిని లోతుగా త్రవ్వడానికి ప్రయత్నించినప్పుడు  'వినాయక స్వామి'  రూపాన్ని కనుగొన్నారు. ముఖం మాత్రమే కనిపించింది.  అది స్వామి వినాయకుని "స్వయంభు విగ్రహం" అని గ్రహించారు.  వారి ఆనందానికి అవధులు లేవు. చివరికి వారు స్వామి వారి విగ్రహం ముందు మోకరిల్లి  ప్రార్థనలతో  కొబ్బరికాయలు కొట్టారు. మంగళహారతులు  సమర్పించారు. వారు విగ్రహాన్ని "స్వయంభు"గా భావించారు.  అప్పుడు కొట్టిన   కొబ్బరినీళ్లతో  ఒకటిన్నర ఎకరాలకు పైగా భూమి పారింది. ఒకటిన్నర ఎకరాన్ని కాణి అని అంటారు. ఆలా కాణి భూమి ఆ నీటితో పారడంతో   ఆ ప్రాంతాన్ని  కాణిపారకంగా  నామకరమం చేసారు.

కాణిపాకంగా మరిన కాణిపారకం 

కాణిపారకం క్రమంగా కాణిపాకంగా మారింది.  అప్పుడు  వినాయక స్వామి చుట్టూ చిన్న ఆలయాన్ని నిర్మించారు.  ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో స్పష్టంగా తెలియదు. కానీ  చరిత్ర ప్రకారం, ఈ ఆలయం 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈనాటికీ, ఎల్లప్పుడూ నీటితో ప్రవహించే “స్వామి” చుట్టూ ఉన్న బావిని మనం చూడవచ్చు. వర్షాకాలంలో నీరు పొంగి పొర్లుతుంది. "స్వామి" చుట్టూ ఉన్న బావిని మనం చూడవచ్చు, ఇది ఎల్లప్పుడూ నీటితో ప్రవహిస్తుంది. వర్షాకాలంలో నీరు పొంగి పొర్లుతుంది.  విగ్రహం చుట్టూ ఉన్న బావిలోని నీటిని "పవిత్ర తీర్థం"గా భక్తులకు అందచేస్తారు. 


రోజు రోజుకు పెరుగుతున్న స్వామి 

స్వయంభూ విగ్రహం తలపై ఏదో గునపం గాయం ఇప్పటికీ ఉంది. "స్వామి" ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నారు. ప్రారంభంలో స్వామి వారి  తల భాగం మాత్రమే కనిపించింది, అయితే ప్రస్తుతం మనం స్వయంభూ విగ్రహాన్ని ఉదరం వరకు చూడవచ్చు. 1947లో గొల్లపల్లి గ్రామానికి చెందిన అరగొండకు చెందిన శ్రీమతి లక్ష్మమ్మ, W/o బెజవాడ సిద్దయ్య  విరాళంగా ఇచ్చిన “స్వామి” అనే వెండి “కవచం” స్వామికి ఇప్పుడు చాలా చిన్నగా అయిపొయింది. అది ఇప్పుడు స్వామికి పట్టడం లేదు.


 బహుదా నదికి ఆ పేరు రావడం వెనుక ....  

శ్రీ వినాయక స్వామి "స్వయంభూ" గా వెలసిన కాణిపాకం బహుదా నది పక్కన ఉంది. నదిని బహుదా అని పిలవడానికి పాత పురాణం కథ ఉంది. కాణిపాకంలో వినాయక స్వామి స్వయంభువుగా వెలిసిన తరువాత, శంకుడు మరియు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు స్వయంభూ శ్రీ వినాయకుని దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. వారు కాలినడకన ప్రయాణం చేసారు. సుదీర్ఘ ప్రయాణం తరువాత  లిఖితుడు చాలా అలసిపోయాడు. ఆకలితో ఉన్నాడు. మామిడి చెట్టు నుండి మామిడి పండ్లను కోసి, తిని ఆకలిని తీర్చుకోవాలి అనుకున్నాడు.  సహాయం చేయమని అతని సోదరుడిని కోరాడు. పండు రాజుకు చెందినదనీ, కోయవద్దని అన్నయ్య హెచ్చరించాడు. కానీ బాగా అలసిపోయి, ఆకలితో, దాహంతో ఉన్న తమ్ముడు మామిడి పండును కోసుకొని  తిన్నాడు. దీంతో అన్న శంకుడు తన తమ్ముడిని రాజు దగ్గరకు తీసుకెళ్లి మామిడి పండు కోసుకొని తిన్న విషయాన్ని చెప్పాడు. తమ్మునికి తగిన  శిక్ష విధించమని కోరాడు.  రాజు తన అనుమతి లేకుండా పండును దొంగిలించిన తమ్ముడికి రెండు చేతులను నరికివేయమని కోపంతో  ఆదేశించాడు. సైనికులు శిక్షను  అమలు చేశారు. తమ్ముడు  చేతులు పోగొట్టుకున్న ఈ దురదృష్టకర సంఘటనకు అన్నయ్య చాలా బాధపడ్డాడు.  స్వామి  దర్శనానికి వెళ్లే ముందు స్వయంభూ వినాయక దేవాలయం సమీపంలోని నదిలో పుణ్యస్నానం చేయాలని అనుకున్నారు.  సోదరులిద్దరూ నీటిలో స్నానం చేశారు. వినాయకుడిని ప్రార్థించడం ద్వారా  తమ్ముడు లిఖితుడుకి ఆశ్చర్యకరంగా  చేతులు తిరిగి వచ్చాయి. అనంతరం అన్నదమ్ములిద్దరూ వినాయక స్వామిని దర్శించుకుని,  ఆశీర్వాదం తీసుకున్నారు.  ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ స్వయంభూ శ్రీ వినాయకుని లీలలు  ఇరుగుపొరుగు గ్రామస్తుల్లో ప్రచారం చేశారు.  పోయిన చేతులను (బహుదా) లిఖితుడికి బహుమతిగా తిరిగి  ఇచ్చిన నదిని ``బహుదా నది''గా  పిలవడం జరిగింది. స్వయంభూ వినాయక స్వామి అందరికి తన ఆశీస్సులు చూపించి, తన భక్తుల జీవితాల్లో ఆరోగ్యం, సంపద మరియు విజయాన్ని అందించడంలో చాలా ప్రసిద్ధి చెందాడు.  ఇలా  కాణిపాకంలో "వరసిద్ది వినాయకుడు" గా స్థిరపడ్డాడు.

సత్య ప్రమాణాల దేవుడు 

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయం (ఆలయం) కూడా "సత్య ప్రమాణాల నిలయం"గా బాగా ప్రాచుర్యం పొందింది. కాణిపాకం ఆలయంలో ఎదురుగా ఉన్నకోనేరులో స్నానం చేసి, తడి బట్టలతో  వరసిద్ది వినాయక స్వామి ముందు ప్రమాణం  చేసే ఆచారం  ఉంది. ఎవరికైనా ఇతరులపై అనుమానం,  ఆరోపణలు ఉంటే,  వినాయకుని ముందు "ప్రమాణం" చేయమని సంబంధిత ఆరోపిత వ్యక్తి లేదా వ్యక్తులను అడగవచ్చు. స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి అసత్య ప్రమాణాలు చేసే వ్యక్తులను 40 రోజుల్లో శిక్షిస్తాడని భక్తులు నమ్ముతారు.  కావున  దోషులు కాణిపాకంలో  ప్రమాణం చేయడానికి దేవుడి ముందు రాకుండా తప్పించుకుంటారు. గతంలో ఒకరు స్వామి ముందు  తప్పుడు ప్రమాణం చేసిన  తన కంటి  చూపును కోల్పోయాడని  ఒక పురాణ కథ  ప్రచారంలో  ఉంది. కాణిపాకం వినాయక స్వామి ముందు చేసిన ప్రమాణాలు  బ్రిటీష్ కాలంలో కూడా గౌరవించబడ్డాయి.  కాణిపాకంలో ప్రమాణం చేస్తే కోర్టులు కూడా దాన్నే సాక్ష్యంగా తీసుకుంటాయి. అందుకే ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు  కాణిపాకంలో ప్రమాణం చేయమని ప్రత్యర్థులకు సవాల్ విసరుతుంటారు. కాణిపాకంలో తప్పుడు ప్రమాణం చేయరని నమ్మకం. రాజకీయ నాయకులూ ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారికీ రాజకీయ భవిషత్తు ఉండదని భక్తుల నమ్మకం. అందుకే రాజకీయ నాయకులు కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సాధారణంగా ముందుకు రారు.   అందుకే కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవాలయం "సత్య ప్రమాణాల నిలయం"గా ప్రసిద్ధి చెందింది మరియు భగవంతుని ముందు ఎటువంటి అసత్యం లేని వ్యక్తి ఉనికిలో ఉండడు అనే నమ్మకం ఉంది.

కాణిపాకంలో సత్య ప్రమాణం చేసిన భాజపా మంత్రి  కామినేని  శ్రీనివాసరావు

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు 2018 మార్చి 9న ప్రమాణం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి వైదొలిగింది, దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడ బిజెపి మంత్రులు రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా కామినేని శ్రీనివాసరావు మాట్లాడారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎవరి వద్ద నుండి ఒక్క పైసా తీసుకోలేదని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. అంతేకాదు ఈ విషయమై కాణిపాకం వరసిద్ది వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ 2018 మార్చి 9న కాణిపాకం వినాయక ఆలయంలో  ప్రమాణం చేశారు. అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడంతో తన ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. మంత్రి పదవిలో ఉన్న సమయంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మరోసారి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు.






అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *